నాడు సాయిపథం _ నేడు బాబాల పథం
సాయికి విరాళాలు _ భక్తులకు విరాళాలు
దేవాలయంలో గాని, మసీదులోగాని మొత్తం దీపాలు
వెలుగుతూ ఉండాలి అనేవారు సాయి. ఆయనే స్వయంగా వెలిగించేవారు కూడా!
ఆనాడు దీపాలు
వెలిగించడానికి కావలసిన నూనె వర్తకుల్ని అడిగి తెచ్చేవారు. దేవాలయంలో మీరు
వెలిగించే దీపాలకు నూనె మేము ఎందుకు ఇవ్వాలి అనుకుని వర్తకులు నూనె ఇవ్వడం
మానేసారు.
అప్పుడు
కూడా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. నూనె లేకపోతే దీపాలు వెలిగించలేరా...! నీళ్ళతోనే
దీపాలు వెలిగించారు సాయి. వర్తకులు తమ తప్పు తెలుసుకుని సాయిని క్షమించమని
అడిగారు.
మరి, నూనె అడగడం
ఎందుకు ? అందులో పరమార్ధం ఉంది కనుక ! తనను సేవించే వాళ్ళనే కాదు, దాని కోసం సహాయ
పడిన వాళ్లని కూడా గుర్తిస్తాడు భగవంతుడు.
మంచి
పని చేసే వాళ్లకి మాత్రమే ఫలితం దక్కదు...ఆ పని చేయించిన వాళ్లకి, చెయ్యడానికి సహాయ పడిన వాళ్లకి కూడా ఫలితం దక్కుతుంది.
అలాగే చెడ్డపని
కూడా చెడు చేసిన వాళ్లకే కాదు, చేయించిన వాళ్లకి, చూసిన వాళ్లకీ కూడ దండన తప్పదు !
అన్నారు సాయి.
దీపాలు
వెలిగించింది బాబాయే అయినా దానికి నూనె ఇచ్చి సహాయపడిన వర్తకులు కూడ ఆ ఫలితాన్ని
పొందారు. ఎప్పుడూ ధనార్జన లోనే మునిగి తేలే వర్తకుల్ని భగవంతుడికి దగ్గర చేసి వాళ్లకి
కూడా మోక్షాన్ని కలుగ చెయ్యాలన్నదే బాబా కోరిక.
అది తెలిసిన వర్తకులకు
దీపాలు వెలగడానికి తమ వంతు సహకారాన్ని అందించారు.
బాబా ఎవరి నుంచి
ఏ వస్తువు తీసుకున్నా దాని అవసర ఎవరికి ఉందో అది అక్కడికే చేరేది. దీవల్ల ఇచ్చిన
వాళ్ళకి భగవదనుగ్రహం లభిస్తే, దాన్ని పొందిన వాళ్లకి ఆ అవసరం తీరేది.
దేనినీ ఆశించకుండా కోరికలు, సంపదలు లేని
జీవితాన్ని జీవించి చూపించారు శ్రీసాయినాథుడు !
********
ఈనాడు
అంతటా విద్యుద్దీపాలే కనుక నూనె దీపాల అవసరం తక్కువే ! అయినా దేవాలయాలకు గాని,
మసీదులకు గాని లభిస్తున్న విరాళాలు ఎక్కువే ! పిండి కొద్దీ రొట్టె అన్నట్టు
వస్తున్న ఆదాయాన్ని బట్టి హంగులూ పెరిగాయి.
ఆనాడు విరాళం
సేకరించి ఇచ్చిన వారికి భగవదనుగ్రహం కలగాలి అనుకునేవారు సాయి. ఈనాడు విరాళం
సేకరిస్తున్న వాళ్ళు కోకొల్లలు.
ఎన్నో సంస్థలు
కూడా వెలిశాయి. ఒక్క దేవాలయాలకే కాదు అనాధ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, వ్యాధిగ్రస్తులకు,
అంగ వైకల్యం కలవాళ్లకి, తుఫాను బాధితులకు, భూకంప బాధితులకు ఇలా ఎంతో మంది కోసం
విరాళాలు సేకరిస్తూనే ఉన్నారు. దాతలు ఇస్తూనే ఉన్నారు.
సంస్థలే
కాదు...అయ్యప్ప భక్తులు, ఆంజనేయస్వామి భక్తులు, సాక్షాత్తు బాబా భక్తులు, ఎంతో మంది ఇళ్ళ దగ్గర, రోడ్ల మీద, ఇక్కడ అక్కడ
అని లేకుండ విరాళాలు సేకరిస్తూనే ఉన్నారు. ఈనాటి స్వామీజీల కోసం విరాళాల విలువ చెప్పలేనంత.
ఇంతమంది సేకరించిన విరాళాలు ఎవరి దగ్గరికి
చేరుతున్నాయో.. ఎంత మందికి మంచి జరుగుతోందో.. తెలియదు కాని, భక్తితో విరాళ మిచ్చిన
వాళ్లకి భగవదనుగ్రహం మాత్రం తప్పకుండా కలుగుతుంది.
“ విరాళ సేకరణ
స్వలాభానికి ఉపయోగిస్తే...విశ్వమంతా వ్యాపించిన విశ్వేశ్వరుడు మాత్రం వదలడు !”
No comments:
Post a Comment