About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

ఋషిపంచమి

మన ఆరోగ్యం మాసపత్రికకి ఆగష్టు 2017 లో పంపించిన వ్యాసము
ఋషిపంచమి
   భవిష్యోత్తరపురాణం ఈ ఋషిపంచమి వ్రతప్రాశస్త్యాన్ని గురించి వివరిస్తోంది. పేరుకు ఋషిపంచమి అయినా ఇది పూర్తిగా స్త్రీలకు సంబంధించిన వ్రతంగా చెప్పబడుతోంది. ఒకనొకప్పుడు శితాశ్వుడు అనే రాజు స్త్రీల పాపాల్ని తక్షణమే హరించే వ్రతం గురించి అడిగినప్పుడు బ్రహ్మ ఈ వ్రతాన్ని ఉపదేశించి, శ్రద్ధగా ఆచరిస్తే దోషాలన్నీ పరిహారమవుతాయని చెప్పాడని వ్రతకల్పం తెలియచేస్తోంది.
   మన ప్రాచీన ఋషుల్ని పూజించే వ్రతం ఋషిపంచమి. పురాణ కథల ప్రకారం ప్రతివారి వంశానికి ఒక ఋషి మూలపురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. గోత్ర రూపంలో వాళ్ళ పూర్వ ఋషుల్ని ప్రతిరోజూ స్మరించుకుంటారు. కొంతమందికి వాళ్ళ పూర్వ ఋషుల పేర్లు తెలియవు. లేవనే అనుకుంటారు కాని వాళ్ళ వంశాలకి కూడా ఋషులు ఉన్నారు. మరీచి ఋషి వంశం వరుసగా శ్రీరాముడి వరకు నడిచింది.
   ఎంతోమంది ఋషులకి ప్రతినిథులుగా సప్త ఋషుల్ని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వసిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్తఋషులు. మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదురుణాల్లో ఋషిరుణం కూడా ఒకటి. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్లేమరి. ఇంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కృతజ్ఞతగా వీరిని సతీసమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కాదూ!
  సప్త ఋషుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. దక్షప్రజాపతి కుమార్తెల్లో పదమూడు మందిని, వైశ్వానరుడి కుమార్తెల్లో ఇద్దరినీ పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ల వల్ల దైత్యులు, ఆదిత్యులు, దానవులు సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతాతృణ జాతులు, సింహ, మృగ, సర్పాల్ని, పక్షుల్ని, గోగణాల్ని, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులు, పౌలోములు, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని కుమారులుగా పొందాడు.
   సప్త ఋషుల్లో రెండవవాడైన అత్రిమహర్షి బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడు. అత్రి తన తపోబలంతో త్రిమూర్తుల్ని పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయుల్ని కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.
   భరద్వాజుడు ఉతథ్యుడి కుమారుడు. తల్లి పేరు మమత. బృహస్పతి దయవల్ల జన్మించి, ఘృతాచి పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణుడు జన్మించడానికి కారణమవుతాడు.
   విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రుడితో అబద్ధమాడించడానికి కొంత ఫలాన్ని, మేనక వల్ల శకుంతల జననానికి కొంత ఫలాన్ని పోగొట్టుకున్నాడు. దుష్యంతుడు శకుంతల దంపతులకు పుట్టిన కుమారుడు భరతుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.  
   తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు ఋషులకి అందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వల్ల మాయా గోవుని దర్భతో అదిలించి బ్రహ్మహత్యాపాతకాన్ని పొందాడు. ఆ దోష పరిహారం కోసం గోదావరీనదిని భూమి పైకి తెచ్చిన గొప్ప మహర్షి. తన భార్యను శిలగా మారేట్టు శాపమిచ్చింది అయనే.
జమదగ్ని ఋషి - రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడు పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనస్సులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన అమెని తన కొడుకు పరశురముడితో నరికించాడు. ఆ తరువాత పరశురాముడి ప్రార్థన వల్ల ఆమెను పునర్జీవితురాల్ని చేశాడు.
   ఏడో ఋషి వసిష్ఠుడు. ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానసపుత్రుల్లో ఒకడు. వైవశ్వత మన్వంతరంలో సప్తరుషుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్షప్రజాపతి పుత్రిక ఊర్జద్వారా రజుడు, గోత్రుడు, ఊర్థ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు కుమారుల్ని పొందాడు. స్వాయంభువ మన్వంతరంలోనూ సప్తఋషుల్లో ఒకడు. ఒకప్పుడు మిత్రావరుణులకి ఊర్వశిని చూసి రేతస్సు స్ఖలితం అవడం వల్ల కుండలో వసిష్ఠుడు, అగస్త్యుడు జన్మించారని ప్రతీతి.
   సప్త ఋషులు తేజస్సు కలిగినవాళ్లు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. ఏడు సముద్రాలు, ఏడు కులపర్వతాలు, ఏడుగురు ఋషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాల్ని ప్రాతఃకాలంలో స్మరించడం వల్ల శుభాలు కలుగుతాయని అంటారు. అందుకే భాద్రపద శుక్లపక్ష పంచమి రోజున స్త్రీలు తమ పూర్వకృత దోష పరిహారం కోసం విధివిధానంలో పూజిస్తారు. ప్రతి ఋషిపంచమికి సుమంగళులు ఋషులని పూజించి తమ దోషాల్ని దూరం చేసుకుని, ఆయుష్షు, బలము, యశస్సు, ప్రజ్ఞ పొందగలరని వ్రతవిధానం తెలియచేస్తోంది.
   ఋషిపంచమి వ్రతాన్ని స్త్రీలు తప్పకుండా ఆచరించాలి. వినాయమచవితి మరునాడు వచ్చే పంచమిని ఋషిపంచమి అంటారు. సప్త ఋషులు ఆ రోజున తూర్పున ఉదయిస్తారు. ఆ రోజు బ్రహ్మవిద్య నేర్వవలసిన రోజు. సప్త ఋషుల కిరణాలు ఆ రోజు సాధకుల మీద ప్రసరిస్తాయి. కనుక, బ్రాహ్మీ ముహూర్తంలోనే ధ్యానం చేసుకోవాలి. సప్తఋషులే గాయత్రీమంత్రానికి మూలగురువులు. మానవుడి శరీరంలో ఏడు యోగచక్రాలు ఉంటాయి. వాటిని వికసింపచేసే వారే ఈ సప్తఋషులు.
   మొట్టమొదటిసారిగా వేదమంత్రాల్ని దర్శించి వైదిక ధర్మాన్ని ప్రవర్తింపచేసిన ఆదికాలపు హిందూఋషుల్ని స్మరించే శుభసందర్భం ...భాద్రపద శుద్ధ పంచమి. ఆ రోజున ఉపవాసం ఉంటే ఆ తొలిగురువులు మిక్కిలి ప్రసన్నులయి మనం కోరిన కోరికలు తీరుస్తారు. ముఖ్యంగా స్త్రీలు రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉంటే వారికీ, వారి సంతానానికి తరతరాలపాటు ఆయురారోగ్య సౌభాగ్యాల్ని అనుగ్రహిస్తారు. అత్తలకి శక్తి లేకపోతే కోడళ్ళయినా ఉపవాసం చేయాలి. సర్పదోషాలతో బాధపడుతూ సంతానం లేక బాధపడేవారికి మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా చెయ్యడం వంశవృద్ధికరం. ఐశ్వర్యదాయకం.
   దేవుడు ఎంత కరుణామయుడో చూశారా! ఇది చెయ్యి అంటాడు. పోనీ, చేతకాకపోతే కనీసం చెప్పినదానిలో సగమైనా చెయ్యమంటాడు. అదీకుదరక పోతే అందులో సగం చెయ్యమంటాడు. ఎన్ని మినహాయింపులో చూశారా! అయినా ఆయన్ను తలవలేకపోతున్నాం, కొలువలేకపోతున్నాం. సరే! ఏడుగుర్ని కాకపోయినా వీరిలో ఐదుగురినైనా తప్పనిసరిగా ఈ భాద్రపద శుద్ధ పంచమినాడు స్మరించుకుని అర్చించాలన్నారు. అందుకే ఈరోజును ఋషిపంచమి అన్నారు.
   ఆ ఐదుగురూ ఎవరంటే త్రిగుణాతీతుడైన అత్రి, ఈయన భార్య అనసూయ. వీరిద్దరూ దుర్భిక్షాన్ని పోగొట్టి లోకాన్ని ఉద్ధరించిన జంట. ముఖ్యంగా ప్రస్తుతం ఈ జంటను పూజించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మిగిలిన నలుగురూ భరద్వాజుడు, విశ్వామి త్రుడు, వసిష్ఠుడు, జమదగ్ని. ఈ ఐదుగురినీ పూజించే రోజే ఋషిపంచమి.
వ్రత విధానం
 తప్పనిసరిగా ప్రతిస్త్రీ ఈ వ్రతాన్ని ఏడాదికోమారు చేసుకోవలసిందే! ఈ రోజు సప్తఋషుల్ని వారి భార్యలతోసహా పూజించుకోవాలి. ఈ వ్రతం చేసుకునేందుకు విధిగా కొన్ని నియమాల్ని పాటించాలి. ఉత్తరేణి మొక్కను వేళ్లతో సహా పెరికి దాని కొమ్మతో ఉదయాన్నే పళ్లు తోముకోవాలి. అనంతరం గంగా జలం, బురద, తులసిచెట్టులోని మట్టి, ఆవుపేడ, రావిచెట్టుమట్టి, గంధపు చెక్క, నువ్వులు, గోమూత్రం వీటి నన్నింటిని కలిపి చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆపై108 చెంబులతో స్నానం చెయ్యాలి. స్నానం నదిలో గానీ, ఇంటిలోగానీ చెయ్యవచ్చు. స్నానం చేస్తున్న సమయంలోనే ఈ క్రింది శ్లోకం 108 సార్లు చదవాలి.
"ఆయుర్బలం  యశో వర్చః ప్రజాపశు వశూనిచ!
బ్రహ్మ ప్రజ్ఞాం చ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే!!"

  ఈ వ్రతాన్ని ముత్తైదువులు చేస్తుంటే తిల అభ్యంగ స్నానం చేసి పసువు
, కుంకుమల్ని ధరించి పూజకు కూర్చోవాలి. అదే వితంతువలు చేస్తున్న పక్షంలో విభూది, గోపి చందనం, పంచగవ్యాలతో స్నానం చెయ్యాలి. ఇలా చేసిన అనంతరమే పూజకు ఉపక్రమించాలి.
      పూజామందిరం దగ్గర గణపతి, నవగ్రహాలు ఏడు కలశాల్నిఉంచి అత్రి, కశ్యప, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని మరియు వశిష్ఠ మహర్షుల్ని వారి భార్యలతో సహా ఆవాహనము చెయ్యాలి. అందరికీ షోడశోపచార పూజ చేయాలి. ఏడుగురు వేద పండితులను ఆహ్వానించి వాయనంతో కలిసి తాంబూలము సమర్పించాలి. ఈ పూజా విధానం ముగిసిన తరువాత ఆకాశంలో సప్తబుషుల్ని, అరుంధతిని చూస్తూ ఆయా బుషుల్ని పూజించాలి. అన్నట్టు ఈ పూజకు ముఖ్యంగా నాలుగువత్తుల దీపాన్ని ఉంచాలి. పూజ అయిన తరువాత గేదె పెరుగు, వేయించిన శనగలు, తోటకూర కూర తదితరాలను నైవేద్యం పెట్టి బంధుమిత్రులతో భోజనం ముగించాలి.
   ఆరోజు రాత్రి సప్తర్షులకు సంబంధించిన కథలను వినాలి
. మరునాడు భర్తతో కలిసి హోమము చేసి వ్రతాన్ని పూర్తి చెయ్యాలి. ఇలా వరుసగా ఏడు సంవత్సరాలు చేసి తరువాత ఉద్యాపన చేసుకోవాలి.
వ్రతకథ
   విదర్భదేశంలో ఉత్తంకుడనే బ్రాహ్మణుడికి కూతురు
, కొడుకు ఉండేవారు. దురదృష్టవశాత్తూ కూతురికి పెళ్లైన కొద్దిరోజులకే వైధవ్యం ప్రాప్తించింది. అందువల్ల బ్రాహ్మణజంట ఆమెను తీసుకుని గంగాతీరంలో నివాసముండేవారు. ఒకరోజు ఆ అమ్మాయి శరీరంలో నుంచి పురుగులు పడడం గమనిస్తాడు ఉత్తంకుడు. అయితే ఆయన మంచి దైవభక్తుడు కావడంతో తన కుమార్తెకిలా ఎందుకు జరుగుతోందో దివ్య దృష్టితో గమనిస్తాడు. పూర్వజన్మలో ఈమె రజస్వలైనప్పుడు అన్నంగిన్నె తాకినందువల్ల ఇలా జరిగిందని తెలుసుకుంటాడు. వెంటనే ఈమెతో ఋషిపంచమి వ్రతం చేయించి ఆమె దోషాన్ని పరిహరింపచేస్తాడు.
   అలాగే మరొక కథ కూడా ప్రాశస్త్యంలో ఉంది. విదర్భ నగరంలో శ్వేతజితుడనే క్షత్రియుడు, సుమిత్ర అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేవారు. సుమిత్ర రజస్వల అయిన సందర్భంలో శ్వేతజితు డామెను తాకడం, మాట్లాడడం వంటివి చేస్తాడు. ఈమె కూడా ఆ సమయంలో అందరితోనూ మామూలుగానే మాట్లాడేది. ఇలా కాలం గడచి వారిద్దరూ మరణించి సుమిత్ర కుక్కగానూ, శ్వేతజితుడు ఎద్దుగానూ జన్మించి సుమిత్ర కొడుకు గంగాధరం ఇంటికే చేరతారు.
   ఒకరోజు గంగాధరం సుమిత్ర ఆబ్దీకం పెడుతున్నాడు. గంగాధరుడు తల్లికి శ్రాద్ధక్రియలు పూర్తిచేసి పరమాన్నం నేవేద్యం పెడుతుంటే ఆ కుక్క వచ్చి దాన్ని ముట్టుకుంటుంది. దాంతో ఆ పాయసాన్ని పారబోసి వేరేగా వండి నైవేద్యం పెడుతుంది వంటమనిషి. తద్దినం పెట్టేది తనకే కదా అని పాయసం తింటే దాన్ని పారబోసి వేరే వండించాడని బాధ పడుతుంది కుక్కరూపంలో ఉన్న సుమిత్ర.  తన బాధను ఎద్దుతో చెప్పుకుంటుంది. వీరిద్దరి భాషా తెలిసిన గంగాధరం ఆ మాటలు విని కుక్క రూపంలో ఉన్నది తన తల్లి అని తెలుసుకుంటాడు.  గురువు ద్వారా వాళ్ల గురించి తెలుసుకుని బుషిపంచమి వ్రతం చేసి వాళ్ల దోషాలు పోయేలా చెస్తాడు.
   కాబట్టి ఒకరకంగా చెప్పాలంటే ఋషిపంచమిని ప్రాయశ్చిత్తం కోసం చేసుకునే వ్రతంగానే అనుకోవాలి. ఈ కంప్యూటర్‌ ప్రపంచంలో వ్రతాలు, నోములు అంటే వింతగా చూసినప్పటికీ మన పురాతన ఆచార వ్యవహారాల్నీ ఇప్పటికీ ఎంతో నిష్టగా ఆచరించేవారు ఎంతో మంది ఉన్నారు.
 నీతి నియమాల్ని తప్పకుండా భగవంతుడిపై మనసు పెట్టి ఆయన్నే ధ్యానించే వారూ ఉన్నారు. వారందరి దివ్యత్వం వల్లనే ప్రస్తుతం ఎన్ని కష్టాలు వస్తున్నావాటినుంచి మబ్బువీడిన చంద్రునిలా వెంటనే బయటపడ గలుగుతున్నాం.
   మనకి తెలియకుండానే ఎన్నో పాపాలు చేస్తుంటాం. కనుక పూర్వం నుంచీ నడుస్తున్న మన సంప్రదాయం ప్రకారం ఈ ఋషిపంచమి వ్రతాన్ని భక్తితోను, నియమనిష్ఠలతోను  చేసుకుని సప్తఋషుల దయకు పాత్రులవుదాం.
   స్త్రీలందరికీ ఋషిపంచమి శుభాకాంక్షలు!!

No comments:

Post a Comment