About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మత్సరము కర్ణుడు కథ

మత్సరము
కర్ణుడు కథ
   పాండవులు బ్రాహ్మణ వేషంలో ద్రౌపదీ స్వయంవరానికి వెళ్ళారు. ఎంతోమంది రాజులు ప్రయత్నించినా ఎవరికీ సాధ్యం కాలేదు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు.
   మత్స్యయంతాన్ని కొట్టిన అర్జునుణ్ణి చూసి క్షత్రియ కుమారులు ఆశ్చర్యపోయారు. ఇది మానమాత్రుడికి సాధ్యం కాదు.
   ఇతడు బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడో, హరుడో, భానుడో, గుహుడో అయి ఉండచ్చు అంటూనే అక్కడ చేరిన రాజులందరు అర్జునుణ్ణి పొగుడుతున్నారు. దేవతలు పూలవాన కురిపించారు.
   బ్రాహ్మణులు క్షత్రియుల వల్ల కానిదాన్ని సాధించమన్న ఆనందంతో తమ పై పంచెలు తీసి గాలిలో ఎగరేసి ఆనందంతో కేకలు పెట్టారు.
   ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు అర్జునుడికి చెరొక వైపు నిలబడ్డారు.ఆ సంతోష సమయంలో సుందరాంగి అయిన పాంచాలి మందగమనంతో వయ్యారంగా నడుస్తూ రాజకుమారులందరు చూస్తుండగా వచ్చి మన్మథుడిలా వెలిగిపోతున్న పరాక్రమశాలి అర్జునుడి మెడలో పూలమాల వేసింది.
   ఆ ఉత్సవాన్ని చూస్తున్నకర్ణ, దుర్యోధన బృందానికి అసూయతో కళ్ళుకుట్టాయి. ఈ ద్రుపదుడు మనల్ని ఎంత అవమాన పరిచాడు? బంధువుల్ని పిలిచినట్టు రాజులందర్నీ ఇక్కడికి ఎందుకు రప్పించాలి? రప్పించి మనల్ని కాదని బ్రాహ్మణుడికి కన్యని ఎందుకు అప్పగించాలి?
   మనకి అవమానం చేసిన ఇతడికి గుణపాఠం చెప్పాలి. ఈ ఉత్సవ ప్రదేశాన్ని రణభూమిగా మారుద్దాం రండి అని రాజకుమారుల్ని రెచ్చగొట్టారు.
   కాని, రాజకుమారుల తీరు వేరే విధంగా ఉంది. ఈ బ్రాహ్మణ కుమారుడి తప్పులేదు. తన విద్యానైపుణ్యంతో రాజకుమారిని దక్కించుకున్నాడు. ఏ దోషమూ లేని బ్రహ్మణుణ్ణి చంపితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది.
   కాబట్టి, గర్వంతో గుడ్డివాడైన పాంచాల రాజు మీదకి యుద్ధానికి వెడదాం. ఆ బ్రాహ్మణ బాలుణ్ణి విడిచి పెట్టండి అని అంటూనే రాజకుమారులు  అర్జునుణ్ణి వదిలేసి ద్రుపదుణ్ణి చుట్టేశారు.
   వాళ్లందర్నీ చూసిన ద్రుపదుడు బ్రాహ్మణ సమూహంలోకి చొచ్చుకు పోయాడు. బ్రాహ్మణులందరు రాజుకి అండగా నిలబడ్డారు.
   అర్జునుడు నా అస్త్రాలతో వాళ్ళ దర్పాన్ని అణగ్గొడతాను మీరందరు కొంచెం దూరంగా ఉండండి అని బ్రహ్మణులకి చెప్పి తన అవక్ర పరాక్రమంతో రాజలోకం మీద విజృంభించాడు.
   వాళ్ల మీదకి ఆపకుండా బాణాలు వదిలాడు. భీముడు ఒక పెద్ద చెట్టుని పెళ్ళగించుకుని వచ్చి చేత్తో పట్టుకుని అర్జునుడికి సహాయంగా నిలబడ్డాడు.
   అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని యాదవుల వైపు ఉన్న బలరాముడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. శ్రీకృష్ణుడు నెమ్మదిగా అన్నా! ఆ మహా కోదండాన్ని పట్టుకుని శత్రువుల్ని పారిపోయేలా చేస్తున్నవాడు పాండవ మధ్యముడు అర్జునుడు.
   అతడి పక్కనే మహావృక్షాన్ని పట్టుకుని యుద్ధం చేస్తూ విజృంభిస్తున్న వాడు వృకోదరుడు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని వేసినప్పుడు బహ్మణ వర్గం నుంచి లేచి బయటకి వెళ్ళిన గౌరవర్ణంతో ఉన్నవాడు ధర్మరాజు. అతడి వెంట వెళ్ళినవాళ్ళు ఇద్దరూ నకుల సహదేవులు అని చెప్పాడు.
   వాళ్ళు అయిదుగురు పాండవులన్న విషయం విని ఆశ్చర్యంతోను ఆనందంతోను పరవశించి పోయాడు బలరాముడు. కృష్ణా! ఏమిటీ వీళ్ళు పాండవులా? ఎంత భాగ్యం! లక్క ఇల్లు కాలిపోయినప్పుడు వీళ్ళు ఎలా తప్పించుకున్నారో?  ఈ మహా వీరుల్ని దర్శించగలిగిన ఈ రోజు ఎంతో పుణ్యమైన రోజు ! అని మళ్ళీ మళ్ళీ అంటూ బలరాముడు ఆనందభాష్పాలు కారుస్తున్నాడు. 
   భీమార్జునులతో యుద్ధం చేసి అనేకమంది రాజులు ఓడిపోతున్నారు. దుర్యోధనుడికి ప్రాణసఖుడు, అంగరాజ్యానికి రాజయిన కర్ణుడు పార్థుడితో యుద్ధానికి తలపడ్డాడు. మద్రదేశానికి రాజయిన శల్యుడు భీముడితో యుద్ధం మొదలెట్టాడు.
   వాళ్ళ యుద్ధ కౌశల్యాన్ని అక్కడ కూర్చున్న వాళ్ళు ఆనందంగా చూస్తున్నారు. కర్ణార్జునులు, భీమశల్యులు ఘోరంగా పోరాడుతున్నారు. కర్ణార్జునులు వేస్తున్న బాణాలతో ఆకాశమంతా కప్పబడి పోయింది. అర్జునుడు బాణాలు వేస్తున్న వేగానికి వాటిని ఆపలేక పోతున్నాడు కర్ణుడు.
   ఇంత గొప్పగా బాణాలు సంధిస్తున్న ఈ బ్రాహ్మణ కుమారుడు ఎవరో అనుకుని బ్రాహ్మణకుమారా! క్షత్రియుల్లో అర్జునుడు, బ్రాహ్మణుల్లో పరశురాముడు తప్ప యుద్ధభూమిలో నన్ను ఎదిరించి పోరాడ గలిగినవాడు మరొకడు లేడు. నీ పరాక్రమం, నీకు విలువిద్యలో నేర్పు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి అన్నాడు.
   రాధేయుణ్ణి చూసి అర్జునుడు నవ్వుతూ నువ్వు ఇప్పుడు చెప్పిన వాళ్ళల్లో నేను ఎవ్వర్నీ కాదు. శాస్త్రవిద్యలన్నిటిలోను ప్రావీణ్యాన్ని సంపాదించిన బ్రాహ్మణ తేజస్సు కలవాణ్ణి. ఈ రణరంగంలో నిన్ను ఓడించబోతున్నవాణ్ణి. ఇంక అప్రస్తుత ప్రసంగాలు అపు అన్నాడు.
   కర్ణుడు సిగ్గుపడి బ్రాహ్మణ తేజస్సుని ఓడించడం కుదరని పని అనుకుని అర్జునుడితో యుద్ధం ఆపి వెళ్ళిపోయాడు. మల్లయుద్ధంలో భీముడు తన బలంతో శల్యుణ్ణి పట్టి కింద పడేశాడు. శల్యుడు వెంటనే లేచి ఒళ్ళు దులుపుకుని బహ్మణ వర్గం నవ్వుతుండగా  అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
  స్వయంవరానికి వచ్చిన రాజులందరు తమతమ దేశాలకి వెళ్ళిపోయారు. అందరూ చూస్తుండగా ద్రౌపదిని వెంటపెట్టుకుని భీమార్జునులు వెళ్ళిపోయారు.
   ఉత్సాహంగా ఉన్న బ్రాహ్మణులందరూ ఆనందంతో గుమిగూడి బీమార్జుల వెనక నడిచారు.

అసూయ ఉన్న చోట అవమానం తప్పదు!!

No comments:

Post a Comment