మన ఆరోగ్యం మాసపత్రికకి 2017 సెప్టెంబరు నెలకి వ్యాసము
వామనజయంతి
శ్రీ
మహావిష్ణువు త్రివిక్రముడిగా అవతరించిన అవతారం వామనావతారం. భాద్రపద
శుక్లపక్షంలో ద్వాదశి రోజున మహా పతివ్రత అయిన ఆదితికి శ్రీమహావిష్ణువు
కుమారుడుగా జన్మించాడు. ఈ అవతారం విశిష్ఠతని గురించి
విష్ణుపురాణంలో వివరించబడింది.
వ్యాసమహర్షి రచించిన పద్ధెనిమిది పురాణాల్లో
వామనపురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపంతో అవతారమెత్తి బలి
చక్రవర్తిని పాతళ లోకానికి పంపించాడు. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో వామనవతారం
అయిదవది.
ఈ
పురాణం పూర్వభాగం, ఉత్తరభాగం అని రెండు భాగాలుగా విభజించబడింది. పూర్వభాగంలో 10 వేల
శ్లోకాలు ఉన్నాయి. ఉత్తరభాగం ఇప్పుడు దొరకట్లేదు. ఈ పురాణంలో శ్లోకాలే కాదు గద్య
భాగాలు కూడా ఉన్నాయి. పూర్వభాగంలో 97 అధ్యాయాలు ఉన్నాయి.
కురుక్షేత్రంలో బ్రహ్మ సరోవరాన్ని గురించి
సరోమహత్యం అనే పేరుతో 28 అధ్యాయాల్లో వర్ణింపబడింది. బలిచక్రవర్తి జరిపిన
యజ్ఞం కురుక్షేత్రంలో జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం. ఈ పురాణాన్ని పుల్యస్తుడు
నారదుడికి చెప్పాడని అంటారు.
ధర్మానికి
భంగం కలిగినప్పుడు తాను అవతరించి ధర్మసంస్థాపన చేస్తానని శ్రీ కృష్ణుడు చెప్పినట్టు
మనకు భగవద్గీత తెలియచేస్తోంది. ద్ధర్మసంస్థాపన కోసం భగవంతుడు ఈ భూమి మీద అవతరించడమే దశావతారాలలో ఒకటైన
వామనావతారం.
వామనుడి అవతార చరిత్రలో బలిచక్రవర్తి, వామనమూర్తి మాటల్లో
పే చక్కటి సందేశం ఇమిడి ఉంది. వామనావతారాన్ని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం...
పూర్వం దేవతలతో యుద్ధం
జరిగినప్పుడు రాక్షసరాజైన బలిచక్రవర్తి ఇంద్రుడి వల్ల యుద్ధంలో ఓడిపోయాడు. అవమానం
భరించలేక గురువైన శుక్రాచార్యుడిని
శరణువేడుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత గురువు శుక్రాచార్యుడి దయవల్ల బలిచక్రవర్తి స్వర్గం మీద అధికారాన్ని
సంపాదించాడు.
దీంతో అధికారం పోగొట్టుకున్న ఇంద్రుడు తల్లి అదితి
దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకుని తన పదవి తనకి వచ్చేటట్టు చెయ్యమని ప్రార్థించాడు.
ఇంద్రుడి పరిస్థితిని చూసిన అదితికి దుఃఖం కలిగింది. పయోవ్రతానుష్టానం చేసి శ్రీమహావిష్ణువుని ఆశ్రయించింది.
ఆ వ్రతం పూర్తవుతూ ఉండగా చివరి రోజు శ్రీమహావిష్ణువు
అదితికి ప్రత్యక్షమయ్యాడు. ఆమెతో “తల్లీ! బాధపడకు. నీకు నేను కుమారుడిగా జన్మించి, ఇంద్రుడికి
చిన్న తమ్ముడిగా ఉండి అతడికి అంతా మంచి జరిగేటట్టు చేస్తాను!” అని చెప్పి అంతర్థానమయ్యాడు.
ఇలా అదితికి శ్రీమహావిష్ణువు
వామన రూపంలో కుమారుడిగా జన్మించాడు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువునే కుమారుడిగా
పొందిన అదితి సంతోషానికి అంతులేదు.
శ్రీమహావిష్ణువుని వామనమూర్తిగా బ్రహ్మచారి
రూపంలో దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందపడ్డారు. వామనమూర్తికి ఉపనయన సంస్కారాలు
తామే స్వయంగా నిర్వర్తించి ధన్యులయ్యారు.
బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను
దానంగా పొంది, ఒక అడుగును భూమిపై మోపి, రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రిందనుంచి
ఒక్కోదాన్నే దాటుకుంటూ ఎలా విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా, ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు మహాభక్తుడు,
కవి పోతన.
ఇంతింతైవటుఁడింతయైమరియుఁదానింతైనభోవీధిపై
నంతైతోయదమండలాభ్రమునకల్లంతైభారాశిపై
నంతైచంద్రునికంతయైధ్రువునిపైనంతమహర్వాటిపై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
నంతైతోయదమండలాభ్రమునకల్లంతైభారాశిపై
నంతైచంద్రునికంతయైధ్రువునిపైనంతమహర్వాటిపై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
ఇంతయ్యాడు, మరింకింతయ్యాడు, ఆకాశానికి అంతయ్యాడు, మేఘమండలానికి అల్లంతయ్యాడు, జ్యోతిర్మండలానికి
అంతయ్యాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుడికి దాటి ఇంకా పైకి వెళ్లాడు, మహర్లోకం దాటిపోయాడు, సత్యలోకంకన్నా
ఉన్నతంగా ఎదిగాడు. బ్రహ్మాండమంతా నిండిపోయాడు – ఇదీ ఒక కుబ్జబాలకుడు
క్రమక్రమంగా అజాండభాండాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తి. క్రింద మునులూ, బలి చక్రవర్తీ, శుక్రుడూ
నివ్వెరపోయి చూస్తున్నారు.
క్షణానికి ముందు కళ్లముందు నిలబడి ఉన్న బ్రహ్మచారి
బాలకుడు – ఒక్కసారిగా కాదు – క్రమక్రమంగా ఎదిగి భూనభోంతరాలు నిండిపోవడాన్ని ఇంతకన్నా అందంగా
రూపు కట్టించడం అసాధ్యం. పద్యం పద పదానికీ విరుగుతూ, వామనుడు పదపదానికీ
పెరుగుతూ పోయే క్రమతను చూపిస్తూ. ఇంతై, అంతై, దీనికింతై, దానికింతై అంటూ ఒక గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష వివరణ మన కళ్ళకి కట్టినట్టు చూపించాడు. భక్తపోతనకి
నమస్కరిద్దాం!
బలి చక్రవర్తి భృగుకచ్ఛము అనే ప్రదేశంలో
అశ్వమేధ యాగం చేస్తున్నాడని వామనమూర్తికి తెలిసింది. వెంటనే బ్రహ్మచారి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. బ్రహ్మతేజస్సుతోను, దివ్య యశస్సులతోను
వెలిగే వటుడైన వామనుడు దండాన్ని, గొడుగుని, కమండలాన్ని ధరించి; పవిత్రమైన రెల్లుగడ్డితో మొలత్రాడుని, యజ్ఞోపవీతాన్నీ ధరించి; శరీరం మీద
మృగచర్మం, శిరస్సు మీద జడలతో వామనుడు బ్రాహ్మణ రూపంతో
యజ్ఞమండపంలోకి ప్రవేశించాడు.
బ్రాహ్మణ బ్రహ్మచారిని చూసిన బలిచక్రవర్తి పూజ్య
భావంతో ఉచితాసనం మీద కూర్చోపెట్టి
పూజించాడు. ఆ తర్వాత వామనుడిని ఏం కావాలో అడగమన్నాడు...వామనుడు “మూడు అడుగుల
భూమి" కావాలని అడిగాడు.
శుక్రాచార్యుడుకి శ్రీమహావిష్ణువే ఆ రూపంలో
వచ్చాడని తెలుసు. అందువల్ల ఆ బ్రహ్మచారికి దానం ఇవ్వద్దని శిష్యుణ్ణి వారించాడు.
కాని, శుక్రాచార్యుడు ఎంత వారించినా బలిచక్రవర్తి ఆయన మాట వినలేదు. దానం చెయ్యడం
కోసం సంకల్పం చెప్పడానికి తన చేతిలో ఉన్న
జలపాత్రని ఎత్తాడు.
శుక్రాచార్యుడు తను చెప్పినదాన్ని తన శిష్యుడు
వినట్లేదని అతడి మేలుకోరి జలపాత్రలో ప్రవేశించి జలం వచ్చే దారికి తన ముఖాన్ని
అడ్డుపెట్టాడు. వామనమూర్తి ఒక దర్భని తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిలో
పొడిచాడు. ఆ దర్భ శుక్రాచార్యుడి కంటికి గుచ్చుకుంది. దాని వల్ల శుక్రాచార్యుడికి
ఒక కన్ను పోయింది .
సంకల్పం పూర్తి అయిన వెంటనే వామనావతారంలో ఉన్న
విష్ణుమూర్తి తన ఆకారాన్ని పెంచి ఒక్క అడుగు భూమి
మీద, మరొక అడుగు ఆకాశం మీద పెట్టాడు. మూడు అడుగు పెట్టడానికి
చోటు కావాలని బలిచక్రవర్తిని అడిగాడు.
బలిచక్రవర్తి భక్తితోను, అనందంతోను
శ్రీమహావిష్ణువు విరాట్స్వరూపాన్ని చూస్తూ మూడో అడుగు పెట్టడానికి తన తలను చూపిస్తూ వినయంగా
కూర్చున్నాడు. దీంతో మూడో అడుగును బలిచక్రవర్తి తలపైన పెట్టిన త్రివిక్రముడు
అతన్ని పాతాళానికి తొక్కేశాడు.
బలిచక్రవర్తి దాన గుణానికి సంతోషించిన
శ్రీమహావిష్ణువు అతడికి పాతాళలోక రాజ్యాన్ని యిచ్చాడు. ఇంద్రుడికి ఇంద్ర పదవిని
అప్పగించాడు అని పురాణాలు చెబుతున్నాయి.
అటువంటి మహిమాన్వితుడైన వామనుడు పుట్టిన రోజున
శ్రీ మహావిష్ణువుని నిష్ఠతో ప్రార్థించేవాళ్లకి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పెద్దల
మాట.
బలిచక్రవర్తి దాన గుణానికి మెచ్చుకుని శ్రీమహావిష్ణువు
ప్రతి సంవత్సరం కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని తను చూసుకునేట్టు వరమిచ్చాడు.
ఇప్పటికీ కేరళలో బలిచక్ర్రవర్తి రాక కోసం
ఎదురుచూస్తూ ఓనం అనే పేరుతో పండగను జరుపుకుంటూ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
భాద్రపద శుద్ద ద్వాదశి వామన జయంతిగా చెప్పబడింది, ఈ రోజున వామనమూర్తిని ఆరాధిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది.
ముఖ్యంగా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలని పొందవచ్చు అని
పురాణాలమాట.
శ్రీమహావిష్ణువు మన రక్షణ కోసం ఎన్నో అవతారాలు
ఎత్తాడు. అందులో వామనావతారం కూడా ఒకటి. అందుకే వామనజయంతి రోజు కృతజ్ఞతతో
శ్రీమహావిష్ణువుని భక్తితో సేవిద్దాం.
పాఠకులకి వామనజయంతి శుభాకాంక్షలు
భమిడిపాటి
బాలాత్రిపురసుందరి
సెల్ నం. 9440174797
No comments:
Post a Comment