About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

సుందరమైన కథలు - యముడి కోరల్లోంచి


యముడి కోరల్లోంచి
  
   ఆమెకి తెలుసు అమె భర్త క సంవత్సరంలో చచ్చిపోతాడని. ఎలాగయినా సరే తన భర్తని యముడి కోరల్లోంచి బయటకి తీసుకు రావాలని ఆమె పట్టుదల. అనుకున్నట్టే చేసింది కూడా. ఇదే సావిత్రి కథ.
   సావిత్రి ఒక రాజకుమార్తె. ఆమె తల్లితండ్రులు చాలాకాలం సూర్యభగవానుణ్ణి ఉపాసించడం వల్ల పుట్టింది. ఆమె గొప్ప గుణవంతురాలు. యుక్త వయస్సు వచ్చాక తనకు వరుణ్ణి తనే ఎంచుకోవాలని అనుకుంది. వరుడి కోసం వెతుక్కుంటూ అనేక ప్రదేశాలు తిరిగింది. అడవిలో ఒక కుటుంబంతో ఆమెకి పరిచయ మయింది. వాళ్ళ కుమారుడు సత్యవంతుణ్ణి చూసి అతన్నే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ విషయం ఇంటికి వెళ్ళి తలితండ్రులకి చెప్పింది.
   సావిత్రి ఎంచుకున్న వరుణ్ణి చూసి సావిత్రి చాలా దురదృష్టవంతురాలని అనుకుని అందరూ చాలా బాధపడ్డారు. సత్యవంతుడు రాజకుమారుడే అందులో సందేహం లేదు. సావిత్రి వంటి సుగుణాలరాశికి అతడు సరయిన వరుడే. కాని, సత్యవంతుడు అల్పాయుష్కుడు.
    సత్యవంతుడు జీవితంలో ఇంకా అనేక అపదల్లో చిక్కుకుని ఉన్నాడు. అతడి తండ్రి రాజ్యం పోయింది. కుటుంబమంతా అడవిలో నివసిస్తున్నారు. సత్యవంతుడి తల్లితండ్రులకి మాత్రమే తెలిసిన భయంకరమైన రహస్యం ఒకటి ఉంది. తమ కుమారుడు అల్పాయుష్కుడని, ఒక సంవత్సరమే జీవిస్తాడని. ఆ విషయాన్ని నారదమహర్షి చెప్పాడు.
   సత్యవంతుడిలో భగవంతుడు మెచ్చే ఒక గుణం సత్యాన్ని పలకడం. అతడు ఎప్పుడూ నిజమే పలుకుతాడు, అంకితభావం కలవాడు, గుణవంతుడు. సత్యవంతుడికి ఆయుష్షు తక్కువ ఉందని, అతడి తల్లితండ్రులకి రాజ్యం లేక అడవులవెంట తిరుగుతున్నారని తెలుసుకుని సావిత్రిని చూసి అందరూ జాలి పడ్డారు. ఆమె తల్లితండ్రులు కళ్లనీళ్లతో ఆమె మనస్సుని మార్చుకోమని సావిత్రికి మరీ మరీ చెప్పారు. వాళ్ళు ఎంత చెప్పినా ఆమె వినలేదు.
   సావిత్రి తండ్రి” సావిత్రీ! ఇతణ్ణి కాకుండా మరొక వరుణ్ణి ఎంచుకో. సత్యవంతుడు మంచివాడు, గుణవంతుడే! అయినా అతడు దురదృష్టవంతుడు. నువ్వు రాజకుమార్తెవి కనుక నీకు మరొక వరుణ్ణి కోరుకునే అవకాశం ఉంది మళ్ళీ ఆలోచించుకో అని చెప్పాడు.
   సావిత్రి మాత్రం “ తండ్రీ! నేను గౌరవనీయమైన కుటుంబంలో పుట్టిన ఆడపిల్లని. నా మనస్సుని ఒకసారి సత్యవంతుడికి ఇచ్చేశాక మళ్ళీ మార్చుకోలేను. ఏది జరిగితే అది జరుగుతుంది. ఏది ఎలా జరిగినా దాన్ని నేను భరిస్తాను” అంది. నారద మహర్షి కూడా అమెకి అనేక విధాలుగా నచ్చచెప్పాడు. కాని ప్రయోజనం లేకపోయింది.
   సావిత్రి సత్యవంతుల వివాహం జరిగిపోయింది. సత్యవంతుడికి మాత్రం అతడి ఆయుష్షు తగ్గిపోతోందని తెలియదు. ఒక సంవత్సరం గడిచిపోయింది. కొన్ని రోజుల్లో అతడికి మరణం తప్పదు. ఈ నిజాన్ని సావిత్రి మాత్రం మర్చిపోలేదు.
   పెళ్ళి జరిగిన వెంటనే సావిత్రి రాజభవనాన్ని వదిలి తన భర్తతో కలిసి అడవులకి వెళ్ళిపోయింది. అడవుల్లో అత్తమామలతో ఉంటూ వాళ్ళ ప్రేమని పొందింది. కష్టాలు మొదలయ్యాయి. ఆమెకి ఇప్పుడు తన భర్తను రక్షించుకోడమే ధ్యేయం.  రాత్రి పగలు భర్త ఆయుష్షు కోసమే భగవంతుణ్ణి  ప్రార్ధిస్తోంది. ఆమె అందరిలా కన్నీళ్లతోను, బాధతోను గడపట్లేదు. రాబోయే ఆపదనుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ తను సాధించగలను అన్న నమ్మకంతో జీవిస్తోంది.
   సత్యవంతుడికి భూమిమీద చివరి రోజు ...అదే కథగా మారింది. కట్టెలు తీసుకుని రావడానికి దట్టమైన అడవిలోకి వెడుతున్న సత్యవంతుడితో సావిత్రి కూడా బయలుదేరింది. సత్యవంతుడు ఆమెను రావద్దని చెప్పినా వినకుండా అతణ్ణి అనుసరించింది. ప్రతి క్షణం భర్తలో కలిగే మార్పుల్ని గమనిస్తోంది. ఆ క్షణం రానే వచ్చింది. ఇద్దరూ దట్టమైన అడవిలో ఉండగా ఉన్నట్టుండి సత్యవంతుడికి నీరసంగా అనిపించి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. సావిత్రి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. అంతే అతడి శ్వాస ఆగిపోయింది. మొదట సావిత్రి భయపడింది .. అంతలోనే తనని తాను సరిపెట్టుకుంది.
   సత్యదీక్షాపరుడైన సత్యవంతుడు భగవంతుడికి ఇష్టుడైయ్యాడు. సావిత్రి తన పూజలతోను, పాతివ్రత్యంతోను పవిత్రురాలయింది. ఇద్దరూ దేవతా స్వరూపులయ్యారు. సత్యవంతుడి ఆత్మని తీసుకెళ్లడం అంత తేలిక కాదు. అతడి ఆత్మని తీసుకుని వెళ్ళడానికి యముడే స్వయంగా వచ్చాడు. సావిత్రి తన పాతివ్రత్య ప్రభావం వల్ల తన భర్త ఆత్మని తీసుకుని వెడుతున్న యముణ్ణి చూడగలిగింది.
   సత్యవంతుడి ఆత్మను తీసుకుని వెడుతున్న యముడు తన వెనకాలే వస్తున్న సావిత్రిని చూసి ఆశ్చర్య పోయాడు. ఆమె వైపు చూసి “సావిత్రీ! వెనక్కి వెళ్ళిపో! నువ్వు నా వెనుక రాలేవు!” అన్నాడు.
   సావిత్రి వినయంగా ”స్వామీ! నేను నా విధిని నిర్వహిస్తున్నాను. నా భర్తని అనుసరించడం నా విధి. ఇప్పుడు కూడా నేను నా భర్త సత్యవంతుడి వెనకాలే వెడుతున్నాను. అతడు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను!” అంది.
   యముడు సావిత్రిని తన వెనుక రావద్దని అనేక విధాలుగా నచ్చచెప్పాడు. ఆమె వినకుండా అతడి వెనుకే నడుస్తూ” నేను వివాహితురాల్ని. భర్తని అనుసరించడం నా ధర్మం. నేను నా భర్తని అనుసరిస్తూ వస్తాను!” అని మళ్ళీ అదే మాట చెప్పింది.
   చావుకు భగవంతుడైన యముడు ఆమెకు భర్తయందు ఉన్న అంకిత భావాన్ని అర్ధం చేసుకున్నాడు. సావిత్రి పాతివ్రత్యానికి మెచ్చుకుని సత్యవంతుడికి పూర్ణాయుష్షుతో పాటు రాజ్యం, సంపదలు, పిల్లలు మొదలయినవన్నీ ఇచ్చాడు. అంతేకాదు సావిత్రి తల్లితండ్రులకి, అత్తమామలకి కూడా కావలసినవన్నీ ఇచ్చాడు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడ ధైర్యాన్ని వదలకుండా పోరాడి సావిత్రి భర్తని దక్కించుకుంది.
   కొన్ని వందల సమస్యలు ఎదురుగా ఉన్నాకూడా ఒక భారతీయ మహిళ చావుని సవాలు చేసి అనుకున్న దాన్ని సాధించడమే కాకుండా  అసాధ్యమైన తన బంధువుల సమస్యల్ని కూడా భగవంతుడి అనుగ్రహంతో తీర్చగలిగింది. అందుకు ఆమె స్వచ్ఛమైన మనస్సు, పవిత్రతలే కారణం.
   కష్టాలు గలిగాయని బాధపడుతూ కూర్చోకుండా ధైర్యంతో వాటిని ఎదుర్కోవాలి. ఆకాశంలో దట్టంగా అలుముకున్న నల్లటి మేఘాలు వాటంతటవే చెల్లా చెదురుగా వెళ్ళిపోగానే ఆకాశమంతా సూర్య కాంతి ప్రసరిస్తుంది. అదే విధంగా ఆపదలు తొలగిపోగానే సుఖసంతోషాలు జీవితంలో ప్రసరిస్తాయి. సత్యదీక్ష, పవిత్రత, భగద్భక్తి, పట్టుదల ఉంటే ఎటువంటి కష్టాన్నైనా అవలీలగా దాటవచ్చు అన్నారు స్వామి వివేకానందుడు.
   ఆపదలు కలిగినప్పుడు భగవంతుణ్ణి సేవిస్తూ ధైర్యంగా ఉండాలి. సావిత్రి తనకు కలిగిన ఆపదల్ని ధైర్యంగా ఎదుర్కుని, తన భర్తని యముడి దగ్గర నుంచి వెనక్కి తెచ్చుకోడమే కాకుండ అదే ఆపదని అవకాశంగా  మార్చుకుని తన అత్తమామలకి, తలితండ్రులకి కూడా మంచి జరిగేలా చూసింది.


No comments:

Post a Comment