About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

దైవారాధనలో బాలుడు-సుందరమైన కథలు

దైవారాధనలో బాలుడు
   ధ్రువుడు ఒక గొప్ప చక్రవర్తికి కొడుకు. అయినా కూడా చక్రవర్తి కొడుకుకి ఉండవలసినంత గొప్ప రాజభోగాలు అతడికి దక్కలేదు. ధ్రువుడు అతడి తల్లి కూడా ఎన్నో కష్టాల్ని అనుభవించారు. అందుకు కారణం అతడి సవతి తల్లి.
   పూర్వం ఉత్తానపాదుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. ప్రజలందరు అతడి పాలనలో సుఖంగా జీవించారు. అతడికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు సునీతి, రెండవ భార్య పేరు సురుచి. సునీతి కొడుకు ధ్రువుడు. సురిచి కొడుకు ఉత్తముడు.
   ఉత్తానపాదుడు అన్ని ధర్మాలూ తెలిసినవాడే అయినా మోహాన్ని మాత్రం జయించలేక పోయాడు. చిన్న భార్య సురుచి అంటే అతడికి ఎక్కువ ఇష్టం. పిల్లలిద్దరూ మాత్రం సంతోషంగా కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు.
   ఒకరోజు ఉత్తానపాదుడు సురుచి మందిరంలో ఉన్నాడు. ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు. ఉత్తానపాదుడు అతణ్ణి ఎత్తుకుని ముద్దాడుతున్నాడు. ఆ సమయంలో ధ్రువుడు కూడా  తండ్రి ఉన్న మందిరంలోకి వెళ్ళాడు. ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చోడం చూసి, సంతోషంగా అనిపించింది. నెమ్మదిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
   ఉత్తానపాదుడి పక్కనే నిలబడి ఉన్న సురుచి ధ్రువుడి ముఖం వైపు చూసింది. అతడి మనస్సులో ఉన్న కోరికని గ్రహించింది. వెంటనే అతడి చెయ్యి పట్టుకుని పక్కకి లాగింది. “ధ్రువా! ఆగు! నువ్వు ఏం చేద్దామని అకుంటున్నావో నాకు అర్ధమయింది. నీకు నీ తండ్రి ఒళ్ళో కూర్చునే అర్హత లేదు. నీకు ఆ అర్హతే ఉంటే నువ్వు నా కడుపున పుట్టి ఉండేవాడివి. వెళ్ళి శ్రీహరికి పూజలు చేసుకో. అప్పుడైనా నీ కోరిక తీరుతుందేమో!” అని హేళనగా మాట్లాడింది.
     సురుచి మాటలు విన్న ఉత్తానపాదుడు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. చిన్నవాడైనా కూడా సవతి తల్లి మాటలు ధ్రువుణ్ణి బాధ పెట్టాయి. పరాభవాన్ని సహించలేక పోయాడు. కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలాయి. సవతి తల్లి మాటల కంటే అమె అంటున్నప్పుడు తండ్రి మౌనంగా ఉండడం అతణ్ణి మరింత బాధపెట్టింది.
   వెక్కి వెక్కి ఏడుస్తూ ధ్రువుడు తల్లి సునీతి దగ్గరకి వెళ్ళాడు. సునీతి కొడుకుని దగ్గరకి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. నెమ్మదిగా తల నిమురుతూ “నాయనా! ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగింది.
   తల్లి అలా ప్రేమగా అడగ్గానే ధ్రువుడి దు:ఖం ఇంకా పెరిగింది. వెక్కిళ్ళు పెడుతూనే సవతి తల్లి దగ్గర జరిగిందంతా తల్లికి చెప్పాడు. తన కొడుకు సవతి తల్లిచేత అవమానం పొందడం ఆమెకి కూడా బాధ కలిగించింది. కొంతసేపయ్యాక “నాయనా! బాధపడ్డం వల్ల ప్రయోజనం లేదు. లోకంలో ప్రతి మనిషి కర్మకి బద్ధుడై  ఉంటాడు. కర్మను అనుసరించే అన్నీ జరుగుతూనే ఉంటాయి. దాన్ని కాదని నడిచే శక్తి ఎవరికీ ఉండదు. నిన్ను చూస్తుంటే నాకు కూడా బాధగానే ఉంది. నేను కూడ ఏమీ చెయ్యలేను. నీ తండ్రి నన్ను దాసి కంటే ఎక్కువ నీచంగా చూస్తున్నారు. నేను చాలా దురదృష్టవంతురాల్ని. నా కడుపున పుట్టడం వల్ల నీకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయేమో.
  కుమారా! ఈ విషయం అలా ఉంచు. సురిచి చెప్పిన దాంట్లో అసత్యం ఏదీ లేదు. అమె చెప్పినట్టు నువ్వు శ్రీహరి పాదాల్ని ఆశ్రయించు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు కావలసినవన్నీ భగవంతుడు ఇస్తాడు. నువ్వు భక్తితో సేవిస్తే గొప్ప సింహాసనమే ఇవ్వచ్చు!” అంది అనునయంగా.
   తల్లి మాటలతో ధ్రువుడు దు:ఖాన్ని వదిలి పెట్టాడు. ధైర్యాన్ని పొందాడు. తను కూడా మహర్షులు చేసినట్టు తపస్సు చెయ్యాలని అనుకున్నాడు. తల్లి అనుమతి తీసుకుని అడవులకి బయలుదేరాడు.
   ఆడవిలో నడుస్తుండగా అతడికి నారద మహర్షి కనిపించాడు. నారదుడు ధ్రువుడి గురించి మొత్తం యోగదృష్టితో చూశాడు. నారదుడు ఎవరో ధ్రువుడికి తెలియదు. అయినా కూడా నారదుడి పాదాలకి నమస్కారం చేశాడు. నారదుడు ఎంతో సంతోషించి అతడి తలని ముద్దాడి “ కుమారా! నీ గురించి పూర్తిగా నాకు తెలుసు. నీ తండ్రి మహారాజు. మీ ఇల్లు లక్ష్మీ నిలయం. చిన్న చిన్న అవమానాలు జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కర్మని అనుసరించి జరుగుతాయి. తపస్సు చెయ్యడమంటే అంత తేలిక కాదు. శ్రీహరిని చూడాలని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నువ్వు చిన్నవాడివి, తిరిగి ఇంటికి వెళ్ళిపో! అని నారదుడు ఎంతగా చెప్పినా ధ్రువుడు తన పట్టు విడవలేదు.
   “మహాత్మా! నేను రాజకుమారుణ్ణి. పౌరుషాభిమానాలు నాకు పుట్టుకతోనే ఉంటాయి. దైవ చింతనకి వయస్సుతో పనిలేదు. దృఢమైన మనస్సుతో ప్రార్ధిస్తే భగవంతుడు పలుకుతాడు. నేను చిన్నవాణ్ణి కనుక ఏ విధంగా తపస్సు చెయ్యాలో తెలియట్లేదు. మీరు నాకు ఉపదేశిస్తే ఆ విధంగా తపస్సు చేసుకుంటాను” అని అడిగాడు ధ్రువుడు.
   నారదుడు ధ్రువుడి మనస్సు ఇంక మారదని అర్ధం చేసుకున్నాడు. అతడి పట్టుదలకి సంతోషించాడు. “కుమారా! జరుగుతున్న వాటికి దేనికీ మనం కర్తలం కాదు. అంతా భగవంతుడి అధీనంలోనే ఉంటుంది. తపస్సు చెయ్యాలని నీకు సంకల్పం కలిగించినవాడు కూడా భగవంతుడే. లోకం మొత్తం శ్రీహరే నిండి ఉన్నాడు. తపస్సు చేసుకోవాలంటే అందుకు అనువైన ప్రదేశం ఉండాలి.
   యమునా తీరంలో మధువనం ఉంది. అది నీ తపస్సుకు తగిన ప్రదేశం. భగవంతుణ్ణి సేవించడానికి కావలసిన పువ్వులు, ఆకలి తీర్చుకోడానికి పండ్లు, పరిశుభ్రమైన నీళ్ళు కూడా దొరుకుతాయి. నువ్వు చిన్నవాడివి కనుక నీకు నియమ నిబంధనలు లేవు” అని చెప్పి ఇరవై ఏడు రోజులు దీక్షతో జపంచేసి వాసుదేవుణ్ణి చూడగలిగేట్టు వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు. ధ్రువుడు మహర్షికి నమస్కరించి మధువనం వైపు నడిచాడు.
   ధ్రువుడు నగరం వదిలేసి వెళ్ళాడని తెలిసి ఉత్తానపాదుడు చాలా బాధ పడ్డాడు. నిద్రాహారాలు మానేసి కృశించిపోయాడు. రాచకార్యలన్నీ వదిలేశాడు. ధ్రువుడు ఏమయిపోయాడో అని మధనపడుతున్నాడు. ఒకరోజు నారదమహర్షి వచ్చి ధ్రువుడికి ఏమీ జరగదని, తిరిగి వస్తాడని ధైర్యం చెప్పి వెళ్ళాడు.
   ధ్రువుడు మధువనం చేరుకున్నాడు. యమునానదిలో స్నానం చేసి తపస్సులో మునిగిపోయాడు. కొన్ని రోజులు పండ్లు తిని, కొన్ని రోజులు నీళ్ళు మాత్రమే తాగి, మరికొన్నిరోజులు ఆహారం నీరు కూడా లేకుండ కఠోర దీక్షతో తపస్సు చేస్తూ అయిదు నెలలు గడిపాడు.
   అతడి తపస్సుకు మెచ్చి శ్రీహరి గరుడవాహనం మీద మధువనానికి వచ్చాడు. ఆ సమయంలో ధ్రువుడు ఒక వేలి మీద నిలబడి తపస్సు చేస్తున్నాడు. అతడు కళ్ళు విప్పగానే శ్రీమన్నారాయణుడు కనిపించాడు. ఆ తేజస్సు చూసి భగవంతుడే తనకోసం వచ్చాడని సంతోషంతో ఆనందబాష్పాలతో అభిషేకిస్తూ ఆయన పాదాల మీద వాలిపోయాడు. చిన్నవాడైన ధ్రువుడికి శ్రీహరిని ఎలా స్తుతించాలో తెలియలేదు. శ్రీహరి తన చేత్తో అ బాలుడి తల నిమిరాడు. ధ్రువుడు దివ్యజ్ఞానాన్ని పొందాడు. అతడి ముఖం బ్రహ్మ తేజస్సుతో వెలిగి పోతోంది.అపూర్వమైన తేజస్సుతో పాటు, అతడి శరీరానికి కాంతి, బలం కూడా కలిగాయి.
   ధ్రువుడు రెండు చేతులూ జోడించి “ దేవా! సకల జీవులకి ఆధారమైన నువ్వు ఈ చిన్నవాణ్ణి అనుగ్రహించడానికి వచ్చావు. లోక పాలన కోసం అనేక రూపాలు పొందుతావు. నారదుడు చెప్పిన విధంగా నిన్ను సేవించాను. నీ విశ్వరూపాన్ని చూడగాలిగాను. నా సవతి తల్లి మాటలకి బాధపడి నిన్ను సేవించాను. అందుకు నేను కృతార్ధుణ్ణయ్యాను. నన్ను అనుగ్రహించు” అని ప్రార్ధించాడు. పట్టుదలకి, ఏకాగ్రతకి, ధైర్యానికి, భక్తికి వయోపరిమితి లేదు. చిన్నతనంలో అనుసరించే విధానాలే జీవితం చివరివరకు వెన్నంటి వస్తాయి అంటారు స్వామి వివేకానందుడు.
   ధ్రువుడి మాటలకి శ్రీహరి అనందంతో “ కుమారా! మహా యోగులకి కూడా కుదరనంత దృఢమైన భక్తితో నన్ను వశం చేసుకున్నావు. నువ్వు చేసినట్టు ఇంత గొప్ప తపస్సు ఎవరూ చెయ్యలేదు. నా అనుగ్రహంతో నువ్వు దివ్యమైన పదాన్ని పొందుతావు. అది ఇప్పుడు మాత్రం కాదు. ఇరవై ఆరు వేల సంవత్సరాల తరువాత ఇది నువ్వు పొందుతావు. ప్రళయకాలంలో కూడా నీ దివ్య పదానికి నాశనం ఉండదు.
   కొంతకాలం తరువాత నీ తండ్రి రాజ్యం వదిలి అడవులకి వెళ్ళిపోతాడు. నీ సోదరుడు ఉత్తముడు మరణిస్తాడు. నీ సవతి తల్లి సురుచి కూడ తన కొడుకు మీద బెంగతో మరణిస్తుంది. ధ్రువా! నువ్వు నాకు గొప్ప భక్తుడివి. నువ్వు రాజ్యపాలన చేసే సమయంలో క్రతువులు చెయ్యి. బ్రాహ్మణులను గౌరవించు. కావలసిన సౌఖ్యాలన్నీ అనుభవించాక ఎవ్వరూ పొందని దివ్యపదాన్ని పొందుతావు అని చెప్పి శ్రీహరి అంతర్ధానం పొందాడు.
   ధ్రువుడు తిరిగి వస్తున్నాడని చారులు వచ్చి రాజు ఉత్తానపాదుడికి చెప్పారు. రాజు సంతోషంతో చారులకి ఎన్నో బహుమానాలిచ్చాడు. భార్యలతోను, మంత్రి పురోహితులతోను ధ్రువుడికి ఎదురువెళ్ళాడు. ఊరి చివరకి రాగానే ధ్రువుడు అందరూ తనకోసం రావడం చూశాడు. ఉత్తానపాదుడు ధ్రువుణ్ణి ఎత్తుకుని సంతోషంతో ముద్దుపెట్టుకున్నాడు. సునీతి అనందానికి అంతే లేదు. ధ్రువుడు తల్లులకి నమస్కరించి, తమ్ముణ్ణి కౌగలించుకున్నాడు. ధ్రువుడి అపూర్వమైన తేజస్సుని చూసి సవతి తల్లి సురుచి పూర్వం తను అన్న మాటని మరిచిపోయి హరి అనుగ్రహాన్ని పొందిన నీకు ఇంక ఏ ఆపదలూ రావు!” అని దీవించింది.
   ధ్రువుడుశ్రీహరిని ఆరాధించాడు. శ్రీహరి అనుగ్రహంతో విమానంలో గ్రహమండలం, త్రిలోకాలు, సప్తముని మండలం దాటి మహోన్నతమైన దివ్యపదాన్ని పొందాడు. తనతో పాటు తల్లిని కూడ స్వర్గానికి విమానంలో తీసుకుని వెళ్ళాడు. ధ్రువుడు చేరిన దివ్యపదమే ధ్రువమండలం.
   ఆపదలు కలిగినప్పుడు ధైర్యంగా నిలబడి వాటినే మంచి అవకాశంగా అనుకుని దేవుణ్ణి ఆరాధిస్తే ఆపదలు వాటంతట అవే తొలిగి పోతాయి. అనుకున్న దాన్ని దైవ సహయంతో పొందవచ్చు.   
  



No comments:

Post a Comment