అడవిలో తప్పిపోయిన రాజు
నలమహారాజు గుణగణాల గురించి ఒక హంసద్వారా విన్న
దమయంతి అతణ్ణే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దమయంతి గురించి విని ఆమెనే
పెళ్ళి చేసుకోవాలని నలమహారాజు కూడా నిర్ణయించుకున్నాడు. ఆమె ఒక రాజకుమారి, అతడు ఒక
రాజకుమారుడు. ఒక్కసారి వాళ్ళు మనస్సులో నిర్ణయం తీసుకున్నాక ఏది ఏమయినా సరే
నిర్ణయాన్ని మార్చుకునే ప్రశ్నే రాదు. ఇది పూర్వం నుంచి భారతదేశ చరిత్రలో ఉన్న
గొప్పతనం.
కొంతమంది దేవతలు కూడా దమయంతిని పెళ్ళి
చేసుకోవాలని స్వయంవరానికి వచ్చారు. వాళ్ళల్లో ఒకళ్ళని ఎవర్నయినా సరే పెళ్ళి
చేసుకోమని చెప్పమని నలుణ్ణి దమయంతి దగ్గరికి పంపించారు. కాని, దమయంతి మాత్రం
నలుణ్ణే ఎంచుకుంది. దేవతలు దమయంతిని పరీక్షించడానికే వచ్చామని, పెళ్ళి
చేసుకోడానికి కాదని చెప్పి నలదమయంతుల్ని ఆశీర్వదించి వెళ్ళిపోయారు.
మనిషైనాసరే, దేవుడైనాసరే స్త్రీ తన మనస్సుని ఒకసారి ఎవరికేనా ఇచ్చిందంటే
దానికే కట్టుబడి ఉంటుంది. ఆ వ్యక్తి మరణించినా, వ్యాధితో బాధపడుతున్నా, ధనం మొత్తం
పోగొట్టుకుని పేదరికంలో ఉన్నా తన మనస్సుని మార్చుకోదు. ఇది ప్రాచీన కాలం నుంచీ
వస్తున్న బారతదేశపు సంప్రదాయం. అదే విధంగా దమయంతి కూడా తన మనస్సుని నలుడికి
ఇచ్చింది. వేరే వ్యక్తిని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. దేవతలు ఆమె భావాన్ని
గౌరవించి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. నలదమయంతుల వివాహం వైభవంగా జరిగిపోయింది.
దేవతలు దమయంతిని
ఆశీర్వదించి వెళ్ళిపోయినా కలిపురుషుడు మాత్రం వాళ్ళని వదల్లేదు. చెడు లక్షణాలు కలిగిన కలి దమయంతిని పెళ్ళి
చేసుకోవాలని స్వయంవరానికి వచ్చాడు. అప్పటికే స్వయంవరం జరగడం, దమయంతి నలుణ్ణి
వరించడం జరిగిపోయింది. కలికి నలుడి మీద అసూయ కలిగింది. అతడి మీద పగ తీర్చుకోవాలని
నిర్ణయించుకున్నాడు. కలి చెడు గుణాలు కలిగినవాడు కనుక. అతడి పగ కూడా అంత
భయంకరంగానే ఉంటుంది. అవకాశం కోసం ఎదురుచూసి, ఒక బలహీనమైన క్షణంలో నలుణ్ణి
పట్టుకున్నాడు.
నలుడి సోదరుణ్ణి కలుసుకుని జూదం ఆడడానికి
నలుణ్ణి పిలవమని బలవంతం చేశాడు. నలుణ్ణి కూడా ప్రోత్సహించాడు. కలిపురుషుడు తనని
ఆవహించి ఉండడం వల్ల నలుడు జూదం ఆడడానికి అంగీకరించి తన సర్వస్వాన్ని
పోగొట్టుకున్నాడు. దమయంతి నలుణ్ణి హెచ్చరిస్తూనే ఉంది. కాని కలి ప్రభావం వల్ల
నలుడు ఆమె మాటల్ని గౌరవించలేదు.
అంతా పోగొట్టుకున్న తర్వాత నలదమయంతులు
రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళి పోయారు. వాళ్ళు రాజ్యంతోపాటు సర్వస్వాన్ని
పోగొట్టుకున్నారు. అప్పుడు కూడా కలి పురుషుడు వాళ్ళని వెంబడిస్తూనే ఉన్నాడు.
అందువల్ల వాళ్ళు అడవిలో అనేక బాధలు పడ్డారు. నలుడు తన బట్టల్ని కూడా
పోగొట్టుకున్నాడు. తన వెంట వచ్చిన భార్య పరిస్థితిని, ఆమె పడుతున్న కష్టాల్ని
చూడలేక పోయాడు. ఒక రోజు రాత్రి నిద్ర
పోతున్న సమయంలో ఆమెని అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ
విడిపోయారు.
అప్పుడు కూడా కలిపురుషుడు వాళ్ళని వదల్లేదు.
తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా తన భర్త అడవిలో తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళినందుకు
దమయంతి చాలా బాధ పడింది. అయినా తన భర్తని ఒక్క మాట కూడా అనలేదు. ఆమెకి తన భర్తమీద
ఉన్న ప్రేమ, నమ్మకం అంత గొప్పవి.
తను ఒంటరిగా ఉండిపోయినందుకు దమయంతి బిగ్గరగా
ఏడ్చింది. కాని ఆమె తన నమ్మకాన్ని వదల్లేదు. తిరిగి తిరిగి ఎలాగో అడవిలోంచి బయట
పడి ఒక రాజ్యానికి చేరింది. ఆమె బాధ అర్ధం చేసుకున్న మహారాణి ఆమెకి తన చెలికత్తెగా
ఉద్యోగం ఇచ్చింది. దమయంతి తన గురించిన నిజాన్ని ఎప్పుడూ బయట పెట్టలేదు. చాలా నమ్మకంగా మహారాణికి సేవ చేసి అక్కడ స్థిర
పడింది. ఎప్పటికైనా పరిస్థితులు మారి తన భర్తని తప్పకుండా కలుసుకుంటానన్న నమ్మకంతో
జీవిస్తోంది. (మనం చెప్పుకుంటున్నది ఒక కథ అయితే మరో విధంగా చెప్పబడిన కథ కూడా
ఉంది. ఏ విధంగా చెప్పినా నలదమయంతుల జీవితం
సుఖంగా ఉండాలని కోరుకున్నదే).
ఒక రోజు దమయంతి నుదుటి మీద ఉన్నకమలం గుర్తుని
మహారాణి చూసింది. దాన్ని చూసి ఆమె చాలా కాలం క్రితం తప్పిపొయిన తన సోదరి
కుమార్తెగా గుర్తించింది. రాణి అప్పటికే ఆ యువ దంపతుల కన్నీటి గాథని వింది. అందరూ
అనుకున్నట్టే తను కూడా నలదమయంతులు ఇద్దరూ ఆ అడవిలోనే మరణించి ఉంటారని అనుకుంది.
దమయంతిని ఆ పరిస్థితిలో చూసి నిశ్చేష్టురాలయింది. తనని గుర్తించిన మహారాణికి
దమయంతి తన కథ మొత్తం చెప్పింది. జరిగింది విని మహారాణి చాలా బాధపడింది.
నలుడు కూడా బ్రతికే ఉంటాడని, ఇక్కడికి
దగ్గర్లోనే ఎక్కడో కష్టాలు పడుతూ ఉండి ఉంటాడని అనుకుంది. ఎలాగయినాసరే తనకున్న
పలుకుబడిని ఉపయోగించి ఆ దంపతుల్ని కలపాలని అనుకుంది. తన మొదటి పని నలుడు ఎక్కడ
ఉన్నాడో వెతికించడం. అది కూడా చాలా తెలివిగా జరగాలి. అందుకు రాణి బ్రాహ్మణుల్ని
ఎంచుకుంది. వాళ్ళని నలదమయంతుల పేర్లు వెల్లడించకుండా వాళ్ళ కథ మాత్రమే పాటగా
పాడుతూ తిరగమంది. “ఎక్కడయినా ఎవరయినా ఈ కథ విని దాన్ని గురించి మాట్లాడితే
అతడే నలుడు. అటువంటి వ్యక్తి ఎవరయినా తారసపడితే అతణ్ణి రాజ్యానికి తీసుకుని రండి” అని చెప్పింది. ఈ పని గడ్డివాములో సూదిని వెతుక్కోడం
వంటిదే కాని, అసలు ఎదో ఒక విధంగా వెతకడం మొదలుపెట్టాలిగా. చేసేపనిలో నిబద్ధత
పట్టుదల ఉంటే దేన్నయినా సాధించవచ్చు.
కలిపురుషుడు నలుణ్ణి విడిచిపెట్టలేదు. నలుడు
తన భార్యని అడవిలో వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచీ దురదృష్టం అతణ్ణి వెన్నాడుతూనే
ఉంది. ఉన్న కష్టాలకి తోడు అతణ్ణి ఒక కాలనాగు కాటేసింది. దానివల్ల అతడు తన అందమైన
రూపం పోగొట్టుకుని వికారమైన రూపాన్ని పొందాడు. నాగుపాము నలుడితో ’నలమహారాజా! నేను నిన్ను
రక్షించడానికే ఈ పని చేశాను. మంత్రించిన ఈ బట్టని నీ దగ్గర ఉంచుకో. సరయిన సమయంలో
దీన్నిధరించు. నీ అందమైన రూపం తిరిగి నీకు వచ్చేస్తుంది” అని చెప్పి మంత్రించిన బట్టని అతడికి ఇచ్చి వెళ్ళిపోయింది.
నలుడు తన వికారమైన రూపంతోనే తిరుగుతూ ఒక
రాజ్యానికి చేరుకున్నాడు. అతడిలో ఉన్న మంచి లక్షణాల ప్రభావాన్ని ఆపడం కలి పురుషుడి
వల్ల కూడా కాలేదేమో...అతడికి రథాన్ని వేగంగా నడపగలగిన సామర్ధ్యం ఉండడం వల్ల
రథసారథిగా రాజుగారి దగ్గర పనికి కుదిరాడు.
నలుడు రథాన్ని చాలా వేగంగా నడపగలడు. అందువల్ల
తక్కువ సమయంలోనే రాజుగారి దగ్గరున్న రథ సారథుల్లో మొదటివాడుగా నిలిచాడు. అతడి నైపుణ్యానికి
రాజుగారు సంతోషించారు. అతడి వికారమైన రూపం అతడి విద్యకి ఏ మాత్రం అడ్డు రాలేదు. ఏది ఎలా జరిగినా విధి
అతడితో భయంకరంగా ఆడుకుంది. నలుడు తన భార్యని అడవిలో క్రూర జంతువుల మధ్య వదిలి
వచ్చేశాడు. ఏదయినా క్రూరజంతువు ఆమెని చంపేసిందేమో కుడా తెలియదు. అదే జరిగితే నలుడు
తనని తను ఎప్పటికీ క్షమించుకోలేడు.
అతడి కష్టాల్లోకి అనుకోకుండా ఒక వెలుగురేఖ
ప్రసరించింది. ఒకరోజు బ్రాహ్మణుడు పాడుతున్న పాట ఒకటి విన్నాడు. ఆ కథ పూర్తిగా
తనకు సంబంధించిందే. ఆ పాట విని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. బ్రాహ్మణుడు అది
గమనించి నలుడి దగ్గరికి వెళ్ళి అతడి వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే మహారాణికి ఈ
విషయం చెప్పడానికి తమ రాజ్యానికి వెళ్ళిపోయాడు. తన భార్య దమయంతి బ్రతికే ఉందని తెలుసుకుని నలుడు ఒక్కసారి
ప్రశాంతమైన మనస్సుతో గట్టిగా గాలి పీల్చుకున్నాడు. బ్రాహ్మణుడు వెళ్ళి తను కథ
పాడగానే విని ఏడ్చిన మనిషి గురించి వివరాలు మహారాణికి చెప్పాడు. అది విని మహారాణి,
దమయంతి కూడా ఆశ్చర్యపోయారు.
వికారమైన ఆకారంలో ఉన్న సారథిని, అతడికి రథాన్ని నడపడంలో కల నైపుణ్యాన్ని తెలుసుకున్న
మహారాణి తరువాత విషయాల్ని చాలా జాగ్రత్తగా నడిపింది. నలుడు సారథిగా పనిచేస్తున్న రాజుకి
మాత్రమే ఒక ఆహ్వాన పత్రిక పంపించింది. అది మరుసటి రోజు జరగబోతున్న స్వయంవరానికి
మాహారాజుని తప్పకుండా రమ్మని కొరుతూ పంపించిన ఆహ్వనం. అంత తక్కువ సమయంలో
జరగబోతున్న స్వయంవరానికి తప్పకుండా రమ్మని పంపించిన ఆహ్వానాన్ని చూసి రాజు
ఆశ్చర్యపోయాడు.
ఆ రోజుల్లో అటువంటి ఆహ్వానం వచ్చినప్పుడు
వెళ్ళకపోతే రాజులు దాన్ని చాలా అవమానంగా భావించేవాళ్ళు. వెంటనే నలుణ్ణి పిలిచి రథం
తీసి బయలుదేరమన్నాడు. అందవికారంగా ఉన్నా కూడా ఆ సారథి మీదే మహారాజుకి నమ్మకం
ఎక్కువ. ఇద్దరూ బయల్దేరారు. దార్లో రాజుగారు పైన వేసుకున్న వస్త్రం గాలికి ఎగిరి
పోయింది. రాజు తను పైన వేసుకునే వస్త్రం ఎగిరి పోయిందని నలుడు రథాన్ని ఆపితే
వెళ్ళి తెచ్చుకుంటానని చెప్పాడు. కాని నలుడు రాజుతో ’అయ్యా! మనం ఇప్పటికే వందల
మైళ్ళు దాటి వచ్చేశాం. మీ వస్త్రం తెచ్చుకోవాలంటే మళ్ళీ వందల మైళ్ళు వెనక్కి
వెళ్ళాలి. అది జరిగే పని కాదు” అన్నాడు. నలుడు మహారాజుని స్వయంవర సమయానికి నగరానికి
చేర్చాడు.
అక్కడికి వెళ్ళాక స్వయంవరానికి తమకు తప్ప మరే
రాజులకి ఆహ్వానం పంపించలేదని రాజుకి అర్ధమయింది. అది నలుణ్ణి తమ రాజ్యానికి
రప్పించడానికి మహారాణి చేసిన తెలివైన ఏర్పాటు. దమయంతి నలుడు కలిసి మాట్లాడుకునేందుకు
మహారాణి వీలు కల్పించింది. తమ కథ విని ఏడ్చిన అందవికారమైన రథ సారథిని చూసి కొంచెం
సేపు దమయంతి తికమక పడింది. ఇంత అందవికారంగా ఉన్న ఇతడు తన భర్తేనా..? కాకపోతే తమ కథ
ఇతడికి ఎలా తెలుస్తుంది..? కష్టాలు వచ్చినప్పుడు ఇద్దరూ కలిసే భరించారు. ఆమెకి తన
భర్త సుఖంగా ఉండడం, తను అతనికి సేవ చెయ్యడమే ముఖ్యం.
అమె అతడి గురించి తెలుసుకోవడం కోసం అడవిలో
భార్య చీరలో భాగాన్ని తీసుకుని వెళ్ళిన విషయాన్ని ప్రస్తావించేలా చేసింది. ఆ పని
చేసింది నలుడే కాబట్టి అతడు ఏడ్చాడు. ఇప్పుడు నలుడి మనస్సులో కూడా కొన్ని ప్రశ్నలు
ఉన్నాయి. ఒక్క క్షణం అతడు ఆమె పాతివ్రత్యాన్ని శంకించాడు. ఒక మంచి కుటుంబంలో
జన్మించి, పవిత్రమైన మనస్సు కలిగిన దమయంతి వంటి స్త్రీ మళ్ళీ స్వయంవరానికి ఎలా
ఒప్పుకుంది అనేది అతడి సందేహం. ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు ప్రశ్నించుకుని సందేహాలు
తీర్చుకున్నారు. ఇప్పుడు ఇద్దరి మనస్సులు స్వచ్ఛంగాను, ప్రశాంతంగా ఉన్నాయి.
తనకు నాగరాజు మంత్రించి ఇచ్చిన బట్టని ధరించి
తన అసలు రూపాన్ని పొందాడు. ఇప్పుడు వికారమైన రూపం పోయి అందమైన రూపంతో యువకుడైన
నలమహారాజు దమయంతి ఎదుట నిలబడ్డాడు. రాజు నలుణ్ణి చూసి తన దగ్గర రథ సారథిగా
పనిచేసిన వ్యక్తి చక్రవర్తి నలమహారాజని తెలుసుకుని నిశ్చేష్టుడయ్యాడు. దమయంతి చాలా
సంతోష పడింది.
నలమహారాజు తన సోదరుడితో మళ్ళీ జూదం ఆడి అతణ్ణి
ఓడించి తన రాజ్యాన్ని, సంపదల్ని, భార్యని తిరిగి పొందాడు. భార్యని తీసుకుని తన
రాజ్యానికి చేరుకున్నాడు. నలదమయంతులు ఎన్ని కఠిన పరీక్షలు ఎదురయినా చివరికి వాటిని
అధిగమించి సంతోషంగా చాలా కాలం జీవించారు.
“నిస్వార్ధం, స్వచ్ఛమైన మనస్సు, ధర్మప్రవర్తన కలిగిన వ్యక్తిని ఏ శక్తీ నాశనం
చెయ్యలేదు”
No comments:
Post a Comment